

The Eagle News యాదాద్రి భువనగిరి : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు.
ఈ రోజు మినీ మీటింగ్ హల్ లో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలసి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల వారీగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు నిర్వహించనున్నందున అందుకనుగుణంగా వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు . ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలు
ప్రతిబింబించేలా స్టాల్స్, శకటాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ శోభారాణి, ASP రాహుల్ రెడ్డి,భువనగిరి ఆర్డిఓ కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులా రెడ్డి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.